Buddha Venkanna: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిలపై బుద్ధా ఫైర్ 1 y ago
AP : లిక్కర్ స్కామ్ బయటపడటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. వైసీపీ హయాంలో అనేక పాపాలు, అరాచకాలు చేశారని, వీళ్ల పాపాలు రాయడానికి చిత్ర గుప్తుడి పుస్తకం కూడా సరిపోదని విమర్శించారు. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగిపోయారని, కానీ అక్కడ ప్రజలు డబ్బుకు లొంగకుండా చంద్రబాబునే అత్యధిక మెజార్టీతో గెలిపించారని చెప్పారు.
2019 -2024 మధ్యలో మద్యానికి బానిసై చనిపోయిన వారి సంఖ్య 100 శాతానికి పెరిగిందని, ఇది తాము చెప్పిన లెక్కలు కాదని, నేషనల్ క్రైమ్ రికార్డ్ ఆఫ్ బ్యూరో చెప్పిందన్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నారని, ఈ మరణాలకు కారణం పెద్దిరెడ్డి కుటుంబం కాదా ? అని ప్రశ్నించారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి అనేక స్కామ్లు, కబ్జాలు చేశారని, ఎట్టి పరిస్థితుల్లో వీరిని వదిలిపెట్టమని అన్నారు. అరాచకాలకు చంద్రబాబు వ్యతిరేకమని, టీడీపీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో కుంభకోణాలు జరిగాయని, మద్యం విక్రయాల్లో కుంభకోణాలు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని, కానీ టీడీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేస్తే ఎన్నికల్లో గెలిచేవారా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.